GUNTUR CITY NEWS: సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Karthik

సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం…గుంటూరు 29వ డివిజన్ చుట్టుగుంట పోలేరమ్మ గుడి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో, శంకర కంటి ఆసుపత్రి (పెదకాకాని) సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు బి. వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ… సిపిఐ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటోందన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో లేక కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు చిన్న వ్యాధికైనా వేలాది రూపాయలు ఖర్చవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. అందుకే సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు, శుక్లాల ఆపరేషన్లు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం రంగాలను పూర్తిగా బలోపేతం చేసి పేదలకు ఉచిత సేవలు అందించాలని డిమాండ్ చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఇప్పటికే వేలాది మందికి ఉచిత కంటి పరీక్షలు, శుక్లాల ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. కేవలం రాజకీయ పోరాటాలకే పరిమితం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా సిపిఐ ముందుకు సాగుతోందన్నారు. పేదలు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. గతంలో కూడా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు, ఫిజియోథెరపీ క్యాంపులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్యుల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమాజ సేవలో యువత కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహతి, డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రారంభ దశలోనే కంటి సమస్యలను గుర్తిస్తే చికిత్స సులభంగా పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధుల్లో శుక్లాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, సమయానికి ఆపరేషన్ చేయించుకుంటే తిరిగి స్పష్టమైన చూపు పొందవచ్చన్నారు. ఈ శిబిరం ద్వారా వచ్చిన ప్రతి రోగికి ఉచిత పరీక్షలు, మందులు, అవసరమైన వారికి శుక్లాల ఆపరేషన్లు, భోజనం మరియు రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా పేదల పక్షన పోరాటాలు నిర్వహిస్తూనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సిపిఐ పార్టీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు లు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు షేక్ బాషా, కాశీ రత్నకుమారి, నవీన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review