ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ఇంచార్జి) మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవే వస్తున్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పిజిఆర్ఎస్ ద్వారా 36 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 14, రెవెన్యూ విభాగం 8, ప్రజారోగ్య విభాగం 1, అకౌంట్స్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిసిపి సూరజ్ కుమార్, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.



