రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65, సిడిఎంఏ వారి ఉత్తర్వులు తేదీ.1-04-2026 ఆర్ఓసి నం.13032/2/2026/H1-1 మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సోమవారం వార్డుల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురించి, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నగరపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు.



