GUNTUR DISTRICT NEWS: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

Karthik

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సి.ఆర్.డి.ఏ ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ పై ప్రమాదాల పట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. అవసరమైతే బారికేడింగ్ పెట్టాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. నరసరావు రహదారిలో డోకిపల్లి వద్ద ప్రమాదాల నివారణకు రహదారి వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వెస్ట్రన్ బై పాస్ వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు దూరం నుండి కనిపించే విధంగా, ఏ దిశగా వెళ్ళాలో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కర్తవ్యం కావాలి*మాదక ద్రవ్యాల నియంత్రణ కర్తవ్యం కావాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. యువతను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విద్యా సంస్థలు, వాటి చుట్టుప్రక్కల ఎట్టి పరిస్థితుల్లోను మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చూడాలని అన్నారు. వివిధ రూపాల్లో ఉంటున్న వాటిని గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప రవాణా కమిషనర్ కే సీతారామిరెడ్డి మాట్లాడుతూ రహదారులపై ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో 19, రహదారులు, భవనాలు శాఖ పరిధిలో 16 బ్లాక్ స్పాట్ లను గుర్తించడం జరిగిందని చెప్పారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు 307 ప్రమాదాలు జరిగాయన్నారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ సేవ్ లైఫ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రమాద రహిత జిల్లాగా చేయాలని గుంటూరు జిల్లాను 2023 డేటా మేరకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. అయితే ఇప్పటికే బాగా తగ్గుదల ఉందన్నారు. అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ రహదారి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై తనిఖీలు నిర్వహించి, అపరాధ రుసుము విధించడం జరిగిందని వివరించారు. గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో 52 హాట్ స్పాట్ లను గుర్తించి, డ్రోన్ ద్వారా నిఘా పెట్టమని తెలిపారు. విద్యా సంస్థలలో ఈగల్ క్లబ్ లు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.టి.ఓ కె.శ్రీహరి,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఎం.టి.ఎం.సి అదనపు కమిషనర్ శకుంతల, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.శ్రీనివాస మూర్తి, ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి డి.దుర్గా భాయి, జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review