GUNTUR CITY NEWS: ఇన్నర్ రింగ్ ఫేజ్ 3 పనులను వేగంగా చేపట్టాలి

Karthik
4 Views

గుంటూరు నగరానికి కీలకమైన ఇన్నర్ రింగ్ ఫేజ్3 పనులను వేగంగా చేపట్టాలని, అందులో ప్రభావిత భవనాల తొలగింపును త్వరితగతిన పూర్తి చేయడానికి జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3, పెద్ద పలకలూరు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏటుకూరు, 3 వంతెనలు తదితర ప్రాంతాల్లో పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్3 త్వరగా పూర్తీకావడం వలన నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. ఫేజ్3 ఏర్పాటుకు చివరిలో ఉన్న ప్రభావిత భవన యజమానులు అంగీకరించినందున, వాటి తొలగింపుని త్వరితగతిన చేపట్టాలన్నారు. పెద్ద పలకలూరు పరిసర ప్రాంతాల్లో జిఎంసి ఓపెన్ స్పేస్ లను గుర్తించి, వాటిలో ప్రజలకు ఆహ్లాదంగా ఉండేలా పార్క్ అభివృద్ధి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 3 వంతెనల ప్రాంతాన్ని పరిశీలించి, యుజిడి బ్లాకేజి నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. హౌసింగ్ బోర్డ్ లోని ఓ రోడ్ మాస్టర్ ప్లాన్ మార్చాలన్న స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సదరు ఫిర్యాదులో అభ్యంతరాలను సిఆర్డిఏకు పంపుతామని తెలిపారు. ఏటుకూరు ప్రాంతంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని పరిశీలించి, నిర్దేశిత నిబందనల మేరకు లే అవుట్ లు ఉండాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, డెప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review