కేంద్ర ప్రభుత్వం వరుస పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూన్ 9వ తేదీ మంగళవారం గుంటూరు హిమని సెంటర్లో జరిగే రాస్తారోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియ చేయాలని సిపియం, సిపిఐ నగర కార్యదర్శులు కె. నళినీకాంత్, ఎ. అరుణ్కుమార్ పిలపునిచ్చారు. ధరల పెరుగుదల, ప్రజలపై భారలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ప్రచారంలో భాగంగా ఆదివారం లాడ్జిసెంటర్లో నిరసన తెలియచేసి లాడ్జి సెంటర్ నుండి అరండల్పేట పోలీసు స్టేషన్ వరకు, తిరిగి లాడ్జి సెంటర్ వరకు ప్రజలకు కపరత్రాలు పంపిణీ చేస్తూ, పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నళినీకాంత్, అరుణ్కుమార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికా, ఇరాన్ యుద్ధం సాకుగా చూపుతూ గత నెల రోజులుగా పలు దఫాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని విమర్శించారు. పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, రెండోవైపు కేంద్ర ప్రభుత్వం ధనికులు ప్రయాణించే విమానాలకు ఉపయోగించే ఇంధనం ధరలు తగ్గించిందని అన్నారు. అంటే పాలకుల పేదలపై భారాలు మోపుతూ పెద్దలకు వరాల జల్లు కురిపిస్తుందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే సగం ఉన్నాయని, పన్నులు తగ్గించటం ద్వారా సామాన్యులకు ఊరట కలిగించవచ్చని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయటం లేదని, పొదుపు పాటించాలని శుద్ధులు చెప్తున్నారని విమర్శించారు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని, సామాన్యులపై భారాలు మోపే పాలకుల విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గం॥లకు గుంటూరు నగరపాలక సంస్థ వద్ద గల హిమని సెంటర్లో జరిగే రాస్తారోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియచేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కమిటి సభ్యులు బి. ముత్యాలరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు కట్లగుంట శ్రీనివాసరావు, నాయకులు షేక్ ఖాశింషహీద్, ఎ. కళ్యాణి, గండికోట శేషగిరిరావు, షేక్ ఖాశింవలి, రాజేశ్వరరావు, షేక్ అబ్ధుల్ సలీం, షేక్ బాషా, సిపిఐ నాయకులు జంగాల చైతన్య, చిన్నా తదితరులు పాల్గొన్నారు.



