చింతలపూడి, జూన్ 19:-ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ, బాలిక మూడు సంవత్సరాలుగా గల్లంతై ఉండగా, చింతలపూడి పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారిని గుర్తించారు.
చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాంబద్రరావు ప్రత్యేకంగా దృష్టి సారించి FRS-360 ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, సీసీటీవీ ఫుటేజీలు తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మిస్సింగ్ పర్సన్స్ను ట్రేస్ చేయడంలో విజయవంతమయ్యారు.
మూడు సంవత్సరాలుగా ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో పోలీసులు నిరంతర కృషి చేసి వారి ఆచూకీ కనుగొనడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో తమ బాధ్యతను, సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్న సీఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్లతో పాటు ట్రేసింగ్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ రాంబద్రరావును స్థానిక ప్రజలు, పట్టణవాసులు అభినందిస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చింతలపూడి పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.



