విశాఖపట్నం: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సింహాచలాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఆలయానికి చేరుకోగా దేవస్థానం ఈవో వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవాసచార్యులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు.
ఆలయ మండపంలోని రాతి సానలపై చందనం చెక్కలను గంధంగా అరగదీసి మంత్రి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్వామివారి కృపాకటాక్షాలతో కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.



