ఏలూరు, సెప్టెంబర్ 11:– రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల ఏలూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సూచించారు. కూటమి స్ఫూర్తిని కాపాడుతూ మూడు పార్టీల మధ్య సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి స్ఫూర్తికి ఎలాంటి విఘాతం కలగకుండా మూడు పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు.
ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.#ChessTournament #EluruNews #ChessCoaching #MindGames #StateLevelChess #StudentTalent
గత అభ్యర్థుల నుంచి వివరాల సేకరణ
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమై ఆయా డివిజన్లలో ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలు, ఎన్నికల అనుభవాలపై రెడ్డి అప్పలనాయుడు వివరాలు తెలుసుకున్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల సన్నాహకాలు, డివిజన్ స్థాయిలో నాయకులతో సమన్వయం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం తదితర అంశాలపై చర్చించారు. ప్రతి డివిజన్లో పార్టీ పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులకు సూచించారు.
ఏలూరు నియోజకవర్గంలో త్వరలోనే మరో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలను మరింత వేగవంతం చేయనున్నట్లు రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్తలు నారా శేషు, కస్తూరి సాయి తేజస్విని, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు వీరంకిపండు, గౌరవ అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



