Visakha district News :గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు

Sharat
1 View

పాడేరు, ఆగస్టు 3 :– గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసింది. గతంలో హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, కమిటీలో సభ్యులుగా ఉండే గిరిజన సంఘాల ప్రతినిధుల ఎంపికపై సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, అదనపు ఎస్పీ శృతి పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ గిరిజన ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై కమిటీ ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

హైపవర్ కమిటీలో గిరిజన సంఘాల తరఫున సభ్యుల ఎంపికపై జరిగిన చర్చలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు, లీగల్ అడ్వైజర్ కొబ్బా శ్రీనివాస్ పేర్లను ప్రతినిధులు సూచించారు. మిగిలిన ముగ్గురు సభ్యుల పేర్లను పరస్పర చర్చల అనంతరం ఏకాభిప్రాయంతో ఖరారు చేసి మంగళవారం లోపు అందజేయాలని జిల్లా కలెక్టర్ గిరిజన సంఘాల నాయకులను కోరారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన సంఘాల నాయకులు తమ సమస్యలు, వినతులను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అసౌకర్యం కలిగేలా రహదారులపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన గిరిజన ఉద్యమ నాయకులు తమ డిమాండ్లు, వినతులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి తెలియజేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సానుకూల చర్చలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో గిరిజన సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review