నంబూరులోని వివిఐటి విశ్వవిద్యాలయం నందు పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులలో చివరి రోజు అనేక అంశాలపై చర్చ జరిగింది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పై దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని మాజీ రాజ్యసభ్యులు జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఐక్యంగా నిలిచి దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తుల కుట్రలు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారాలు దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయని తెలిపారు.ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ భద్రత, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమగ్రత కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ, ఆర్థిక స్థిరత్వం, అంతర్గత భద్రత విషయంలో దృఢ నిర్ణయాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నించే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.



