
“ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అమరావతిలో విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుడిపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇంధన రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం ద్వారా అటు పర్యావరణాన్ని, ఇటు ప్రజల జేబులను కాపాడవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.”


