పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలో ఆందోళనలు జరగనున్నాయి. 4వ తేదీన వామపక్ష నాయకుల సదస్సు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు జరగనున్నాయి. ఈ వివరాలను సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు హరిప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు శనివారం మీడియాకు వెల్లడించారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో అసలు రేటు కన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారమే అధికంగా ఉందని చెప్పారు. 60 శాతం వరకు ప్రజల నుండి అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. అనూహ్యంగా పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై పరోక్షంగా పడుతోందని అన్నారు. ధరల పెంపును వ్యతిరేకిస్తూ 10 రోజుల పాటు జిల్లాలో జరిగే ఆందోళనా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.



