ఎమ్మెల్సీ రాజనీమాను చైర్మన్ తిరస్కరించడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి దుయ్యబట్టారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చైర్మన్ తీరులో సహేతుకత లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికై పదవిలోకి వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, తాను స్వచ్ఛందంగా ఆ పదవికి రాజీనామా చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయితే శాసన మండలి సభ్యుడు జయమంగళం వెంకటరమణ రాజీనామాను తిరస్కరించిన సంఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా కనిపిస్తోంది. జయమంగళం వెంకటరమణ గారితో పాటు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, చక్రవర్తి, పోతుల సునీత, జాకియా ఖానం సభ్యులు వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2024 నవంబర్లో రాజీనామా సమర్పించినప్పటికీ, దాదాపు సంవత్సరం గడిచినా వాటిపై నిర్ణయం తీసుకోలేదు. సభ్యులు లిఖితపూర్వకంగా మాత్రమే కాదు, సభలో నిలబడి కూడా తమ రాజీనామాలను ఆమోదించాలంటూ కోరినా చైర్మన్ స్పందించకపోవడం గమనార్హం” అని అన్నారు.



