జిల్లాలో పారాక్వాట్ డైక్లోరైడ్ (Paraquat Dichloride 24% SL) విక్రయాలపై తక్షణ నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పలు దుకాణాలలో శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (G.O.Rt.No.421, తేదీ: 22/05/2026) ప్రకారం, అత్యంత ప్రమాదకరమైన “పారాక్వాట్ డైక్లోరైడ్, దాని ఇతర రూపాల (Formulations) విక్రయాలు, పంపిణీ, వాడకాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా తక్షణం నిషేధించినట్లు చెప్పారు. జిల్లాలోని ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్లు (Insecticide Inspectors) నిల్వ ఉంచిన పారాక్వాట్ డైక్లోరైడ్ పురుగు మందుపై అమ్మకాల నిలిపివేత నోటీసులు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా రిటైల్ వ్యాపారుల వద్ద 22,606.75 లీటర్లు.,హోల్ సేల్ వ్యాపారుల వద్ద 65,010.50 లీటర్లు వెరసి 87,617.25 లీటర్ల పారాక్వాట్ డైక్లోరైడ్ నిల్వలకు సంబంధించి తక్షణమే “స్టాప్ సేల్” (అమ్మకాల నిలిపివేత) నోటీసులు జారీ చేయడం జరిగిందని వివరించారు. ఇటీవల కాలంలో పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును తాగడం వల్ల క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతూ అనేక ఆత్మహత్యల సంఘటనలు నమోదయ్యాయని పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP), వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేశాయన్నారు. ఈ మందు శరీరంలోకి వెళ్తే ప్రాణాలు కాపాడటానికి ఎటువంటి విరుగుడు (Antidote) ప్రస్తుతం అందుబాటులో లేదని, ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇందుకుగాను ప్రభుత్వం నిషేధానికి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిషేధం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి 60 రోజుల పాటు అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలోని తయారీదారులు, పంపిణీదారులు, హోల్సేల్, రిటైల్ డీలర్లు ఎవరూ ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ మందును విక్రయించరాదని, నిల్వ ఉంచరాదని హెచ్చరించారు. ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా దొంగచాటుగా అమ్మకాలు జరిపితే, కీటకనాశినుల చట్టం, 1968 (Insecticides Act, 1968) ప్రకారం వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రైతులు ఈ గడ్డిమందు ప్రాణాంతక స్వభావాన్ని గ్రహించి, దీని వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.



