GUNTUR DISTRICT NEWS: రైతులకు ఎరువుల కార్డు – ఎల్ నినో ప్రభావం – ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలి

Karthik

జిల్లాలో రైతులకు ప్రత్యేకంగా ఎరువుల కార్డును జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. జూన్ మొదటి వారంలో రైతులకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కార్డులో రైతు వేస్తున్న పంటకు ఎంత మేర ఎరువులు వేయాలని సూచిస్తూ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధిక పరిమితిలో యూరియా, ఇతర ఎరువులు వాడటం వల్ల రైతుకు అనవసరంగా ఖర్చు ఎక్కువ కావడమేనని తెలిపారు. అధిక పరిమితులలో వాడకం వలన పర్యావరణానికి కూడా మంచిది కాదని, అధిక దిగుబడులు కూడా వచ్చే అవకాశం లేదని వివరించారు. అభిలషణీయ పరిమాణంలో ఎరువులు వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించుటకు రైతులు సహకరించాలని కోరారు. పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. పొన్నూరు, ఫిరంగిపురం, తెనాలి, మేడికొండూరు, కాకుమాను తదితర మండలాల్లో ఇంకా పంపిణీ వేగవంతం చేయాలని అన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ లో రైతు వివరాలు కేవలం 30 శాతం మాత్రమే జరిగిందని, తెనాలి, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, కొల్లిపర మండలాలు దీనిని వెంటనే మెరుగు పరచాలని ఆదేశించారు. కౌలు రైతులకు సి.సి.ఆర్.సి కార్డులు జారీ చేయుటకు వెంటనే గుర్తించి జాబితాను అప్ డేట్ చేయాలని ఆదేశించారు. ఉద్యానవన పథకాల కింద స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని, లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సంబంధిత పనులు సాధించాలని ఆదేశించారు. రాష్ట్ర సూక్ష్మ నీటి పథకం (ఏపి.ఎం.ఐ.పి) కింద లక్ష్యాలు పూర్తి చేయాలని అన్నారు. *ఎల్ నినో ప్రభావం – ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలి*ఎల్ నినో ప్రభావం వలన వర్షాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారని, దీని పట్ల రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వలన వాతావరణ ప్రభావానికి తట్టుకునే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేసారని చెప్పారు. బయటి ఉష్ణోగ్రతల కంటే కనీసం 20 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 46,594 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేపట్టడం లక్ష్యంగా ఉందని, దీనిని పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. సంబంధిత కిట్లను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాకుమాను మండలం కిట్లు పంపిణీ బాగా చేసిందని అన్నారు.వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా జిల్లాకు ఖరీఫ్ కు 18,600 క్వింటాళ్ళు వరి విత్తనాలు అవసరంకాగా, ఏపి సీడ్స్ (APSEEDs), ప్రైవేట్ సంస్థల ద్వారా ఖరీఫ్ కు కావలసిన వరి విత్తనాలు జూన్ మొదటి వారంలోనే రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా నమూనాల సేకరణ జులై మొదటి వారానికి పూర్తి చేసే విధంగా వ్యవసాయ అధికారులు విత్తన నమూనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. భూసారం పెంచడానికి పచ్చిరొట్ట పంట విత్తనాలు పంపిణీ ప్రారంభించి 1,639 క్వింటాళ్ళు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులోకి తేవడం జరిగిందని వివరించారు. పి.యమ్.డి.ఎస్ ( ఋతు పవనాలకు ముందుగా పొడిదుక్కి సాగు విధానం) విధానంలో జిల్లాలో 18,637 విత్తన సంచులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఖరీఫ్ 2026కు జిల్లాకు 57 వేల టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే జిల్లాలో 63 శాతం ఎరువులు – 12,588 టన్నుల యూరియా, 4,931 టన్నుల డి. ఏ. పి.,16,207 టన్నుల కాంప్లెక్స్, 1,180 టన్నుల పొటాష్, 1,464 టన్నుల సూపర్ పాస్పేట్  వెరసి 36,371 టన్నుల ఎరువులు నిల్వ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాకు ఇప్పటికే వ్యవసాయ యంత్ర పరికరాల నిమిత్తం రూ.3.04 కోట్ల మజూరు కాగా, రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ ఆరంభంలోగా పరికరాల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతుల అవగాహన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review