ప్రపంచ మానవాళి అభ్యున్నతకై తన జీవితాన్ని అంకితం చేసిన తత్వవేత్త కారల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనంలో కార్యక్రమం జరిగింది. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్క్స్ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ మార్క్స్ రచనలు నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాయని అన్నారు. కార్మిక, శ్రామిక వర్గాలపై జరుగుతున్న దోపిడీని స్పష్టంగా వెలికితీసిన మహానుభావుడు మార్క్స్ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాల ఆధారంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పరిపాలన సాగిందని గుర్తుచేశారు. దాస్ కాపీటల్ వంటి గ్రంథాలు నేటికీ సమాజంలోని అసమానతలను అర్థం చేసుకునేందుకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాలు, మతోన్మాదం పెరుగుతున్నాయని, దేశంలో నరేంద్ర మోడీ మతవాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మార్క్స్ చూపిన మార్గంలోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు.అధ్యక్షత వహించిన నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ యువతలో మార్క్స్ ఆలోచనలను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గమని, సిపిఐ మరింత చురుకుగా ఉద్యమాలు చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి నగర కమిటీ సభ్యులు జి. సురేష్ బాబు మాట్లాడి ముగించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కార్యవర్గ సభ్యులు నూతలపాటి చిన్న, జంగాల చైతన్య, సమితి సభ్యులు పీవీ జగన్నాథం, శ్రీనాథ్, కాయల రామారావు, నాయక్ తదితరులు పాల్గొన్నారు.



