భీమవరం:- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ ఇలవేల్పు ఆరాధ్యదైవం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు ఉదారంగా విరాళం అందజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణతో పాటు మొత్తం 23 మంది మిత్రబృందం సంయుక్తంగా రూ.3,15,000 విరాళంగా సమర్పించారు.
విరాళం అందించిన అనంతరం దాతలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అరసవల్లి సుబ్రమణ్యం, పాపోలు ఏడుకొండలు దాతలను సత్కరించి శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, జ్ఞాపిక ఫోటోను అందజేశారు.
దేవస్థానంలో నిత్యాన్నప్రసాద సేవలకు భక్తులు విరాళాల రూపంలో ముందుకు రావడం అభినందనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు.



