హైదరాబాద్: ప్రకృతి ప్రేమికుడు, నీటి హక్కుల పోరాట యోధుడు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ గారిని మంత్రి స్వయంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

విధ్వంసానికి గురైన అడవిలా ఆయన శరీరం..
పరామర్శ అనంతరం మంత్రి సురేఖ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. “గాయపడి రక్తం చిందిన దుశర్ల సత్యనారాయణ గారి శరీరాన్ని చూస్తుంటే, గొడ్డలి వేటుకు గురైన అడవిని తలపిస్తోంది. పచ్చదనం కోసం, సమాజ హితం కోసం బ్రతికే ఇలాంటి మహామనిషిపై దాడి జరగడం అంటే, అది మనిషి ఉనికిపైనే జరిగిన దాడిగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటంలో ధీశాలి
నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యపై సత్యనారాయణ గారు చేసిన పోరాటాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు:
- జలసాధన సమితి: ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం జలసాధన సమితి స్థాపించి అలుపెరగని పోరాటం చేశారు.
- చారిత్రాత్మక నిరసన: నాడు ప్రధాని వాజ్ పేయి ముందు ఫ్లోరైడ్ బాధితులను పడుకోబెట్టి, సమస్య తీవ్రతను ఢిల్లీ పీఠానికి తెలిసేలా చేసిన ధైర్యశాలి ఆయన.
నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం
సత్యనారాయణ గారిపై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎస్పీ నరసింహను ఫోన్ ద్వారా ఆదేశించారు.
70 ఎకరాల అటవీ క్షేత్రానికి ప్రభుత్వ రక్షణ
దుశర్ల సత్యనారాయణ గారు తన కృషితో పెంచిన 70 ఎకరాల మానవ నిర్మిత అడవికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
“వన మహోత్సవం నిధులతో ఈ అటవీ క్షేత్రానికి అవసరమైన సంరక్షణ చర్యలు చేపడతాం. జీవవైవిధ్యానికి నిలయమైన ఆ క్షేత్రాన్ని కాపాడటం మన బాధ్యత” అని మంత్రి సురేఖ వెల్లడించారు.
చివరగా, ప్రకృతి శక్తులే ఆయన్ని కాపాడాయని, ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ పర్యావరణ సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. గ్లోబల్ వార్మింగ్ ముప్పును తప్పించేందుకు ప్రతి ఒక్కరూ సత్యనారాయణ గారిని స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.



