.
తిరుమల, జూన్ 13:- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బి.ఎన్. విజయకుమార్ కూడా పాల్గొన్నారు.
దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యేలకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, రైతాంగ సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, ప్రజల ఆశీర్వాదం మరియు సహకారంతో ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పారదర్శక పాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్షం, శాంతి, ఆయురారోగ్యాలు కలగాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ప్రజల విశ్వాసమే తమ బలమని, రాష్ట్రాభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.



