శక్తి యాప్ వినియోగంతో ఓ యువతి అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్నట్లు మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. విజయవాడ బస్టాండ్లో ఆటో ఎక్కిన యువతిని చిన్న కాకాని సమీపంలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడగా, ఆమె శక్తి యాప్ ద్వారా సమాచారమిచ్చింది. వెంటనే స్పందించిన ఆయన నిందితుడు ఫణీంద్రను వెంబడించి పట్టుకుని యువతిని రక్షించినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి అర్ధరాత్రి బయలుదేరి విజయవాడకు చేరుకున్న యువతి అప్రమత్తతతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్లో ఓ ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆమెను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. ఆటో మంగళగిరి దాటి చిన్న కాకాని సమీపానికి చేరుకున్న తర్వాత డ్రైవర్ యువతిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. భయాందోళనకు గురైన యువతి సమయోచితంగా “శక్తి యాప్” ద్వారా పోలీసులకు సమాచారాన్ని చేరవేసింది. సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెంటనే పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు ఫణీంద్రగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో “శక్తి యాప్” వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టంచేసిందని గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ పేర్కొన్నారు.



