GUNTUR DISTRICT NEWS: రాజన్న అమరం – ప్రజల గుండెల్లో పదిలం – జిల్లా కోర్టులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

Karthik

పేదల కన్నీళ్ళు తుడిచేవాడే నిజమైన పాలకుడు” అని మనసా వాచా కర్మణా విశ్వసించి… “పేదవాడి గుండె చప్పుడు వినగలిగితే చాలు – నా జన్మ ధన్యమైనట్టే” అని భావించి… ఆ దిశగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి… తన సంక్షేమ సంతకంతో చెరిగిపోని జ్ఞాపకం మిగిల్చిన మరణం లేని మహానాయకుడు, జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని శాసనమండలి సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కీర్తించారు. రాష్ట్రంలో అంతరాలు లేని అందమైన సమసమాజ స్థాపన కోసం, పెత్తందారులకు వ్యతిరేకంగా పేదల పక్షాన రాజీ లేని పోరు సలుపుతున్న జననేత జగనన్న సాక్షిగా… “రాజన్న అమరం – ప్రజల గుండెల్లో పదిలం” అని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టులో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేళ్ళ అప్పిరెడ్డి వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో సరికొత్త సంక్షేమ అధ్యాయాన్ని లిఖించిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందని తెలిపారు. అందుకే సంక్షేమ పాలన గురించి ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా… అది వైయస్సార్‌కు ముందు – ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల శ్రేయస్సు గురించే తపించారు కనుకనే ఆయన జనం మదిలో ప్రజల మనిషిగా నిలిచారని ప్రస్తుతించారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులతో ప్రజల గుండెల్లో కొలువైన వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై మేము సైతం అంటూ జగనన్న అడుగులో అడుగేస్తామని ప్రతినబూనడం ద్వారా ప్రతి ఒక్కరూ రాజన్నకు నిజమైన నివాళి అర్పించాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ తో అందరికీ ఉచిత వైద్యం అందించిన ఆపద్బాంధవుడు.. అన్నదాతలకు ఉచిత విద్యుత్తు నిచ్చిన రైతు బాంధవుడు.. జలయజ్ఞంతో వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన అపర భగీరథుడు వైయస్సార్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యా దాత.. 108 అంబులెన్సులు, పెన్షన్ పెంపు, తెల్ల రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇల్లు అందించిన నిజమైన ప్రజా నాయకుడుగా అభివర్ణించారు. గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ, వై యస్ ఆర్ అనేది మూడు అక్షరాల పేరు కాదని రెండు రాష్ట్రాల ప్రజల గుండె చప్పుడని కీర్తించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసులురెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రోళ్ళ మాధవి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మారెళ్ళ రేవతి, లీగల్ సెల్ నేతలు బడి మంజుల, కళ్ళం రమణారెడ్డి, చల్లా క్రాంతి, బట్టగిరి వెంకటరమణ, సుదర్శనం క్రాంతి కుమార్, మాతంగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review