GUNTUR DISTRICT NEWS: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే అంతిమ లక్ష్యం – జులై 15 నాటికి సర్ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలి

Karthik

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జూలై 15 నాటికి పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి డివిజన్ , మండల , మున్సిపల్ స్థాయి అధికారులు , నియోజకవర్గ , మండల ప్రత్యేక అధికారులు, యంపీడీఓ లు, మున్సిపల్ కమీషనర్లతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వం కల్పించిందని, పీజీఆర్ఎస్ లో ప్రజలు అందించే వినతులు మరియు ఫిర్యాదులను తక్షణమే స్వీకరించి, సత్వర న్యాయం అందించాలన్నారు. దరఖాస్తులను ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ మరియు డిజిటైజేషన్ కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగించాలన్నారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకొని సంబంధిత బిఎల్ఓ లకు పూర్తి సహకారం అందించి, ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సకాలంలో సమర్పించాలని సూచించారు. బి ఎల్ ఓ లకు వాలంటీర్ల క్రింద ఆశా వర్కర్లు , అంగన్ వాడీ కార్యకర్తలు , ఏ ఎన్ ఎం లు, మెప్మా, డ్వామా సిబ్బందిని కేటాయించి పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి డిజిటైజేషన్ చేయాలన్నారు. ఈ ఆర్ ఓ లు ,ఏ ఈ ఆర్ ఓ లు బి ఎల్ ఓ లు , వాలంటీర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయడం లోను, డిజిటైజేషన్ పై అవగాహనా కల్పించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఈ ఆర్ ఓ , ఏఈ ఆర్ ఓ లు ప్రతి శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జూన్ మాసాంతానికి జలధార పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనులకు సంబంధించి బిల్లులను సమర్పించాలన్నారు. పనులకు ముందు , తర్వాత పురోగతిపై ఫోటోలను అప్లోడ్ చేయాలని , గత సంవత్సరం నాటికి ఇప్పటికి గ్రౌండ్ వాటర్ పెరుగుదలను తెలియజేయాలని భూగర్భ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి వర్షపు బొట్టునూ ఒడిసిపట్టి చెరువుల్లో, కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలన్నారు. గుంటూరు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమం గ్రీన్ గుంటూరు అని , ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో లక్ష 20 వేల మొక్కలను జూలై మాసాంతానికి దశల వారీగా నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొక్కల పంపిణీ , సంరక్షణ చేపట్టాలన్నారు. మండల , నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పీపీబి లో ఇస్తున్న అన్ని ఇస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఎరువుల వాడకంపై శాస్త్రవేత్తలు సూచించిన విధంగా యూరియా, డిఏపి వాడకంపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో , పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా పర్యవేక్షించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మరియు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాట్లు సరిగా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు , ఆర్డిఓ కే.శ్రీనివాస రావు, డిప్యుటీ కలెక్టర గంగరాజు , ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేషశ్రీ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, డిపిఓ నాగసాయి, డి ఎస్ ఓ కోమలి పద్మ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్ధసారధి ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review