GUNTUR CITY NEWS: నగర ప్రజలకు వేసవి ఉపశమనం – 50 చలివేంద్రాల ఏర్పాటు

Karthik
6 Views

నగరంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి బాటసారులకు, కార్మికులకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా నగరవ్యాప్తంగా మొత్తం 50 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన వివిధ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాల వంటి జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ చలివేంద్రాల వద్ద ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చలివేంద్రం వద్ద నిత్యం పరిశుభ్రత పాటించాలని, తాజా నీటిని నింపేలా సిబ్బందిపై ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు చలివేంద్రాలు కొనసాగుతాయని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే చలివేంద్రాలు ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి తాత్కాలికంగా చలివేంద్రం ఏర్పాటుకు తగిన స్థలం కేటాయిస్తామని, ఆసక్తి కల్గిన వారు జిఎంసి ఎస్ఈని సంప్రదించవచ్చని తెలిపారు. అదే విధంగా ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review