GUNTUR DISTRICT NEWS: ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Karthik

ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, జిల్లాలోను 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, ఇతర అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రియాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపి, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరం వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరమని, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వడ దెబ్బకు గురి కాకూడదని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని చెప్పారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీడను కల్పించాలి*ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన చోదకులు కొంత సేపు నిలువ వలసి ఉంటుందని, వారికి నీడను కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన ఎండలో పని చేయకుండా తగిన పర్యవేక్షణ చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ, కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాగు నీటి ఎద్దడి తలెత్తరాదు*తాగు నీటి ఎద్దడి ఏ గ్రామంలోను తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడే గ్రామాలు గుర్తించాలని, అటువంటి గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోర్లను 24 గంటలలో మరమ్మతులు పూర్తి చేయుటకు అవసరమైన విడి పరికరాలు సిద్ధంగా పెట్టాలని ఆదేశించారు. పశువులకు, వీధి కుక్కలకు కూడా తాగునీటిని లభ్యంగా ఉంచాలని సూచించారు. తాగు నీటి నాణ్యత పరీక్షలు ప్రతీ రోజూ చేయాలని ఆదేశించారు. అతిసార తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పైపు లైన్ల ద్వారా సరఫరా అవుతున్న తాగు నీరు ఎక్కడా కలుషితం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగు నీటి పైపు లైన్లు మురుగు నీటి కాలువల గుండా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరించాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review