
తెలంగాణలో సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడిపోతోంది. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అయితే, ఈ ఎండలు సామాన్యులకు సెగలు పుట్టిస్తుంటే.. ఎక్సైజ్ శాఖకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘మందు బాబుల’ పుణ్యమా అని బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ మార్చి నెలలో జరిగిన బీర్ల జాతర ఏంటో ఇప్పుడు చూద్దాం!
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎటు చూసినా వడగాల్పులు, ఉక్కపోత. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి జనం రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు కూల్ డ్రింక్స్పై పడితే.. మరికొందరు చెరుకు రసం, ఐస్ క్రీములతో గొంతు తడుపుకుంటున్నారు. కానీ, మన ‘మందు బాబుల’ లెక్కే వేరు! మండే ఎండల్లో అసలైన రిలీఫ్ అంటే అది ‘చిల్డ్ బీర్’ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారు.
మంచి నీళ్ల ప్రాయంలా బీర్లను కుమ్మేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు ముందే పెరగడం ఎక్సైజ్ శాఖకు పెద్ద ‘కిక్’ ఇచ్చింది. మార్చి నెలలో బీర్ల విక్రయాలు చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గతేడాది మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 39.05 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా.. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 30 శాతం వృద్ధి చెందింది. అంటే ఈ ఒక్క నెలలోనే 50.78 లక్షల కేసుల బీర్లు విక్రయించబడ్డాయి. ధరలు పెరిగినా, జేబులు ఖాళీ అవుతున్నా సరే.. బాడీని కూల్ చేసుకోవడానికి బీర్ వైపే మొగ్గు చూపుతున్నారు.
నిజానికి గతంతో పోలిస్తే బీర్ల ధరలు పెరిగాయి. అయినప్పటికీ సమ్మర్ హిట్ నుంచి తప్పించుకోవడానికి మందుబాబులు వెనకాడటం లేదు. వైన్ షాపులు, బార్ల వద్ద సాయంత్రం వేళల్లో క్యూలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుండటంతో అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేడి పెరుగుతున్న కొద్దీ ఈ విక్రయాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి


