GUNTUR DISTRICT NEWS: బ్రతుకుకు భరోసా రావాలి: కలెక్టర్

Karthik

దివ్యాంగుల బ్రతుకుకు భరోసా రావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను శనివారంఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఆర్జీలను స్వీకరించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు కోరగా ఒకసారి ఉపాధి పొందిన తరువాత మరల వెనుదిరిగి చూడరాదని అన్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు, వారి అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలను తెలియజేస్తూ మొత్తం సమాచారం అందించాలని సూచించారు. నైపుణ్యాలు అవసరమైతే ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఆ మేరకు అవకాశాలు కల్పించుటకు సహకరిస్తామని, దానిని వినియోగించుకోవాలని కోరారు. దివ్యాంగులను పేరు పేరునా పలకరించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను ప్రతి నెల నాలుగవ శనివారం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో అందిన అర్జీలు నాణ్యంగా పరిష్కరించుటకు కృషి చేస్తామని చెప్పారు. ప్రత్యేక గ్రీవెన్స్ ను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ గ్రీవెన్స్ లో అందిన ఆర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి, వారి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నామని వివరించారు. దివ్యాంగులు ఉపాధి కోసం కోరారని, స్వయం ఉపాధి కల్పించుటకు వివరాలు సమర్పించాలని కోరామన్నారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా, పురుషులకు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి కల్పించి స్వయంగా తమ కాళ్లపై నిలిచే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ప్రాంగణంలో కూలర్లు, తాగు నీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి డి.దుర్గా భాయి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, ఆర్.టి.ఓ కె. శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review