GUNTUR CITY NEWS: కోవిడ్ ఫైటర్స్ సేవలు అభినందనీయం

Karthik

నగరంలో గత 6 సంవత్సరాలుగా కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, వేలాది మంది అభాగ్యుల అంతిమ సంస్కారాలు గౌరవ పదంగా చేయడం, నగరంలో పలు సందర్భాలలో మిగిలిపోయిన భోజనాలను సేకరించి లక్షలాది మందికి ఉచితంగా అన్నదానం చేయడం,గత రెండు సంవత్సరాలుగా 175 మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడంతో పాటు ఉచిత అంబులెన్స్ ద్వారా వేలాది మందికి తోడ్పాటును అందించడం లాంటి బహుముఖ సేవా కార్యక్రమాలను కోవిడ్ ఫైటర్స్ నిర్వహిస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలిపారు. ఈనెల 14వ తేదీన గుంటూరు నగరంలో మస్తాన్ దర్గా సమీపంలో గల సుభమ్ కన్వెన్షన్ హాలులో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన 59 మంది మహిళలకు గల్లా మాధవి సర్టిఫికెట్లు, మెమొoటో లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి ప్రసంగిస్తూ మానవసేవే మాధవసేవగా గుర్తించి కోవిడ్ ఫైటర్స్ అవిరళ కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలు ఆత్మన్యూనతా భావాన్ని వదులుకుని ఆత్మవిశ్వాసంతో కృషిచేసి నైపుణ్యాలను పెంచుకుని అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరారు. కుట్టు మిషన్ల లో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకొని మంచి టైలర్ గా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు అంత్యక్రియల అనంతర కార్యక్రమాల నిర్వహణ కోసం స్మశాన వాటికల సమీపంలో మూడు చోట్ల అవసరమైన సౌకర్యాలతో ప్రత్యేక గదులు నిర్మించడానికి కృషి చేస్తానని, కోవిద్ ఫైటర్స్ కు ఆరు లేదా ఏడు నెలల లోపు ప్రత్యేక అంబులెన్స్ ను దాతల సహకారంతో సమకూరుస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు . పఠాన్ అల్లాబక్షు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ భారతదేశంలో రాజకీయ పార్టీలు మతాలు, కులాల వారీగా ప్రజలను చీల్చి అభివృద్ధికి ఆటంకంగా మారినాయని అన్నారు. కొందరు మతోన్మాదులు 20 కోట్ల మందికి పైగా ఉన్న ముస్లింలను ఉగ్రవాదులని,విదేశీయులని ముద్ర వేస్తున్నారని, 40 మంది ముస్లిం యువత కోవిడ్ ఫైటర్స్ ద్వారా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తూ రోల్ మోడల్ గా పేరు పొందిందని తెలిపారు. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాల ప్రజలు సృజనాత్మకత, నైపుణ్యాలతో అభివృద్ధి పథంలో పయనిస్తుంటే 147 కోట్ల జనాభా గల భారతదేశం కుల,మత, ప్రాంతీయ తత్వాలతో వెనుకబడి ఉందన్నారు. కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లాబక్షు ప్రసంగిస్తూ దాతల విరాళాలతో ఉచిత ఆంబులెన్స్ సేవలను అందిస్తున్నామని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వందలాది మందికి ఉచితంగా భోజనాలను అందిస్తున్నామని,ప్రమాదాలలో చనిపోయిన నిర్భాగ్యుల అంతిమ సంస్కారాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సేవల మేనేజర్ రాధిక, ప్రముఖ వైద్యులు బిపి మండల్ ట్రస్ట్ అధ్యక్షులు డా || ఆలా వెంకటేశ్వర్లు, మానవత కార్యదర్శి కె. సతీష్,కార్మెల్ సేవాసదన్ వ్యవస్థాపకులు బ్రదర్ క్లమా కస్, ఆర్ టి ఐ ఉద్యమకారుడు షేక్ బాజీ, కోవిడ్ ఫైటర్స్ నేతలు సయ్యద్ మొహిబ్ ( టోపీ బాబు ), షేక్ బషీర్ అహ్మద్, పఠాన్ ముజీబ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కుట్టుమిషన్ లను 4నెలల పాటు ఉచితంగా నేర్చుకున్న 59 మంది మహిళలకు సర్టిఫికెట్ తో పాటు మెమొoటో లు ప్రధానం చేశారు.

Author
Share This Article
Leave a review