గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ప్రత్యేక ‘స్పోర్ట్స్ థీమ్’ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉద్యోగనగర్, వేణుగోపాల్ నగర్, మధురా నగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా డిజిటల్ పరికరాలకే పరిమితమవుతున్నారని, వారి శారీరక దారుఢ్యానికి మరియు మానసిక వికాసానికి ఆట స్థలాలు, క్రీడలు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, వివిధ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగంలో లేని నగరపాలక సంస్థ స్థలాలను ప్రజలకు మరియు పిల్లలకు ఉపయోగపడేలా సుందరీకరించి, ఒక్కో పార్క్ ఒక్కో థీమ్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ఆయా స్థలాల గుర్తింపు పూర్తయిందని, ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి, బౌండరీలు ఫిక్స్ చేసి, ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నివాసాలకు దూరంగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ చేసి మొక్కలు నాటి, జిఎంసి బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ వేణుగోపాల్, ఏసిపీ రెహ్మాన్, డిఈఈ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.



