ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, APCOS ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 13న గుంటూరులో “రణభేరి – ఇక సమరమే” పేరుతో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు తెలిపారు. బ్రాడీపేట లోని సిఐటియు నగర కార్యాలయము నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు, సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, సిఐటియు కోశాధికారి ఎంసాంబశివరావు, వివిధ విభాగాల రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ శ్యామ్, వి రమేష్ బాబు, సిహెచ్ గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు, రామకృష్ణ లు పాత్రికేయుల ఉద్దేశించి మాట్లాడుతూ గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, APCOS ఉద్యోగులు, టీచర్లు, వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి అనేక సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమన్నారు.శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కు రెండేళ్లు పూర్తయిన కూటమి ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే పోరుబాటకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నం అయిందన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో ప్రాంతీయ రణభేరులు మోగించిన అనంతరం పూర్తిస్థాయి కార్యచరణకు సిద్ధం కాబోతున్నామని, ప్రారంభంలో జరిగే గుంటూరు రణభేరికి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారుసెప్టెంబర్ 13న గుంటూరులో జరిగే “రణభేరి – ఇక సమరమే” సదస్సుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.



