గుంటూరు నగరాన్ని పచ్చదనంతో నింపి, పర్యావరణహితంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీ&బీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.శ్రీనివాస్ బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి మరియు పార్కుల ఆధునీకరణపై ఏపీయూజీ&బీసీ ప్రతినిధులు సమర్పించిన వివిధ ప్రతిపాదనలను సుదీర్ఘంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరానికి కొత్త రూపునిచ్చేలా తొలి విడతలో భాగంగా కాకాని రోడ్, పొన్నూరు రోడ్, అమరావతి రోడ్ మరియు విఐపి రోడ్లను మోడల్ రహదారులుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ నాలుగు ప్రధాన రహదారుల వెంబడి సెంట్రల్ మీడియన్లలో ఆకర్షణీయమైన మొక్కలు నాటడం, అత్యాధునిక ల్యాండ్స్కేపింగ్ పనులు చేపట్టడం ద్వారా నగర ప్రవేశ మార్గాలను ఆహ్లాదకరంగా మార్చవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి తక్షణమే సమగ్రమైన డిజైన్లు మరియు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీయూజీ&బీసీ ప్రతినిధులకు సూచించారు. రహదారులతో పాటు నగరంలోని నగర ప్రజలకు మెరుగైన వినోదం, ఆహ్లాదం పంచేలా పార్కులలో పచ్చదనాన్ని పెంచడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదికలు ఇవ్వాలని కోరారు.సమావేశంలో ఏపియుజి&బిసి జిఎం దయాకర్ బాబు, జెడ్ఎం బేబి, ప్రిన్స్ పల్ ఆర్కిటెక్ట్ సత్యనారాయణ పాల్గొన్నారు.



