GUNTUR DISTRICT NEWS: మత్తు, మాదక ద్రవ్యాలను పారద్రోలాలి: కలెక్టర్

Karthik

జిల్లాలో మత్తు, మాదక ద్రవ్యాలను పారద్రోలాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఇందుకు గట్టి నిఘా అవసరమని పేర్కొన్నారు. మత్తు, మాదక ద్రవ్యాలు నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు, మాదక ద్రవ్యాల మత్తులో పడి యువత నిర్వీర్యం కారాదన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో స్పష్టమైన అవగాహన కలిగించి వారి బంగారు భవితకు బాటలు వేయాలని సూచించారు. అన్ని విద్యా సంస్థలు, వసతి వద్ద గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. విద్యా సంస్థలలో ఈగల్ టీమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణకు అవసరమగు కార్యక్రమాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు ఐదు వందల మీటర్ల వ్యాప్తిలో మత్తు, మాదక ద్రవ్యాలు, పొగాకు సంబంధిత ఉత్పత్తుల విక్రయాలు ఉంటే గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు వద్ద అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రదేశాల్లో డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మత్తు, మాదక ద్రవ్యాల ప్రభావం గల ప్రాంతాల్లో సి.సి టివిల ఏర్పాటుకు జాబితాను సమర్పించాలన్నారు. మందుల దుకాణాలలో తరచూ తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వినియోగించని 92 భవనాలు స్థితిగతుల వివరాలు అందించాలని, వాటిలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు గుర్తించాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు, మాదక ద్రవ్యాల సమాచారంను ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972, మత్తు, మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నంబర్ 1933 కు తెలియజేయవచ్చని వివరించారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ జి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ మత్తు, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. జిల్లాలో 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు 134 కేసులు నమోదు చేశామని అన్నారు. 610 మంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించామని, ఇందులో 157 మంది తరచూ పాల్గొంటున్నట్లు గుర్తించామని వివరించారు. వినియోగించని 92 భవనాలు ఉన్నాయని, వాటిని కొంత మంది అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు గమనించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, ఉప రవాణా కమిషనర్ సీతారామి రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం, జిల్లా అబ్కారీ, ఎక్సైజ్ శాఖ అధికారి ఇ.అరుణ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా అటవీ అధికారి హిమ శైలజ, మానసిక వైద్య నిపుణులు డా.కిరణ్, డా.పరాక్ తదితరులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review