GUNTUR DISTRICT NEWS: జలధారలో 590 పనులు ప్రారంభం

Karthik

జలధార – జల హారతి కార్యక్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 590 పనులు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 718 పనులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి నీటిని నిలువ చేయుటకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని, భూగర్భ జలంగా మారాలని ఆయన అన్నారు. జిల్లాలో చెరువుల నీటి సామర్థ్యం మేరకు నీరు నిలవ జరగాల్సిందేనని అన్నారు. నీటి వసతులలోకి నీరు పారుదలకు ఏ ఆటంకం లేకుండా కాలువల్లో పూడికలు తీయాలని గట్లను బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులను చేపట్టడం జరుగుతుందని, సంబంధిత సిబ్బంది పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన చెప్పారు. ప్రతి చెరువు పూర్తి నీటి సామర్థ్యంతో నిండి ఉండడమే కాకుండా చుట్టుప్రక్కల ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా చూడాలని సూచించారు. ప్రజలను పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. నీటి వనరుల పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను పునరుద్ధరించుటకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలని అన్నారు. గొలుసుకట్టు చెరువులపైనా శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తద్వారా వర్షాలు కురిసే సమయంలో మంచి ఫలితాలు సాధించగలమని, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review