GUNTUR DISTRICT NEWS: సిటీ ఎకనామిక్ రీజియన్’ నమూనాలో సమగ్ర అభివృద్ధిని సాధించాలి

Karthik

అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి ఐటీ పార్క్, ఎయిమ్స్ వంటి సంస్థలతో పాటు జిల్లాలోని గుంటూరు, తెనాలి మునిసిపాలిటీలు, ఎంఎస్ఎంఈ (MSME) రంగాలను అనుసంధానిస్తూ ‘సిటీ ఎకనామిక్ రీజియన్’ (CER) నమూనాలో సమగ్ర అభివృద్ధిని సాధించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరావతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్, జిల్లా ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై జిల్లా అధికారులు, నాలెడ్జ్ పార్ట్‌నర్స్ (PwC) ప్రతినిధులతో ప్రత్యేక వర్క్‌షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, సన్‌రైజ్ రంగాలు, సేవా రంగాల ప్రాధాన్యతపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి, పసుపు వంటి పంటల ముడి ఎగుమతులకే పరిమితం కాకుండా, స్థానికంగానే ఫుడ్ ప్రాసెసింగ్, గ్రేడింగ్, విలువల పెంపు (Value Addition) యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా నదీ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని (Tourism) విస్తరించాలని సూచించారు. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధించేందుకు పటిష్టమైన ప్రాజెక్ట్ డీపీఆర్‌లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న ప్రాంతీయ సదస్సు (Regional Conclave) లక్ష్యంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, నాలెడ్జ్ పార్ట్‌నర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review