GUNTUR DISTRICT NEWS: ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

Karthik

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి  ఘనంగా నివాళులు అర్పించారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంకటకృష్ణారావు జీవిత విశేషాలు, విద్యా రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి, సామాజిక సేవకు ఆయన చేసిన విశిష్ట సేవలను వివరించారు. యువతలో సేవా భావం, దేశభక్తి, తెలుగు భాష పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వ్యవహరించారని అన్నారు. మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను భావితరాలకు చేరవేయడం, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మండలి వెంకట కృష్ణారావు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుల్లో ఒకరని, ఆయన రాజకీయవేత్త, గాంధేయవాది, సంఘసేవకుడు, విద్యా–సాంస్కృతిక పరిరక్షకుడుగా సేవలు అందించారని అన్నారు. ప్రజాసేవను జీవిత ధ్యేయంగా తీసుకొని నిరాడంబర జీవనం గడిపిన ఆయనను “దివిసీమ గాంధీ” అని గౌరవంగా పిలవడం, ఆయన పట్ల ప్రజలకు గల గౌరవం తెలియజేస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.దివిసీమ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. 2026లో ఆయన శత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుటకు నిర్ణయించడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి రమ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లేశ్వరి, స్టెప్ సి.ఇ.ఓ పి.వి.ఎన్.సత్యనారాయణ, మాజీ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డి. సుబ్రహ్మణ్యం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత జాయింట్ రిజిస్ట్రార్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. మాణిక్యాలరావు, సీనియర్ సిటిజన్ మాధా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review