హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాదెండ్ల భాస్కరరావు గారికి జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘన నివాళులు అర్పించారు. సోమవారం హైదరాబాద్లోని భాస్కరరావు గారి నివాసానికి చేరుకున్న ఆయన, తొలుత మాజీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి ప్రకటించారు.
అనంతరం, భాస్కరరావు గారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తుమ్మలపల్లి రమేష్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో దైర్యం వహించాలని కోరారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా భాస్కరరావు సేవలు: ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ… “నాదెండ్ల భాస్కరరావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించిన సేవలు మరువలేనివి. రాజకీయాల్లో ఆయనదొక ప్రత్యేక ముద్ర. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, పార్టీ నాయకులు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.



