GUNTUR DISTRICT NEWS: ఆంధ్రకేసరి జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

Karthik
1 View

తెల్లదొరల తూపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డిన టంగుటూరి ప్రకాశం పంతులు వీరత్వం.. దేశ దాస్య విమోచన యజ్ఞంలో ఆంధ్రులను ఒక్క తాటిపై నడిపించిన ఆయన మార్గదర్శకత్వం.. అందరికీ ఆదర్శమని శాసనమండలి సభ్యులు, ఆంధ్రకేసరి అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కీర్తించారు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన నేతల్లో ప్రధముడైన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆంధ్రకేసరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని ప్రకాశం చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, తెలుగువారి తెగువకు నిలువెత్తు రూపం ప్రకాశం పంతులు అని శ్లాఘించారు. “ప్రమాదములున్నచోటే ప్రకాశం పంతులు గారు ఉంటారు” అన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య మాటలు అక్షర సత్యాలని ఆయన వ్యాఖ్యానించారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న సమయంలో 30వేల మంది స్వచ్ఛందకులతో గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారనీ… తద్వారా గుంటూరుతో ఆయనకు గట్టి సంబంధం ఏర్పడిందనీ… ఆయన వివరించారు. దానికి గుర్తుగానే ఆనాడు తామంతా ఒక కమిటీగా ఏర్పడి, ఆయన పాదయాత్ర చేసిన ఈ ప్రాంతంలో ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దీనికి ప్రకాశం చౌక్‌గా నామకరణం కూడా చేసుకున్న ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తన యావదాస్తినీ త్యాగం చేయడమే కాక తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వల్పకాలంలోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రకాశం పంతులు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బందా రవీంద్రనాథ్, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), బందా శశి, రత్నప్రసాద్, బత్తుల దేవానంద్, అంబేద్కర్, వంశీ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షరీఫ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, పరిశపోగు శ్రీనివాసరావు, కాకి శ్రీను, టీఎల్వీ వీరాంజనేయులు, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, ఆలా కిరణ్, పోకల వసంత్, రెడ్డి కోటేశ్వరరావు, సింగు నరసింహరావు, నర్సిరెడ్డి, బాలిరెడ్డి, భాగ్యారావు, సుందరరావు, సుబ్బరాజు, శంకర్, జాన్సీ, వనజాక్షి, విజయమాధవి, రత్నకుమారి, దుర్గ, శివపార్వతి, అరుణ, మన్నెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review