గుంటూరు (లాం):ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీలలో కృష్ణా మండల వ్యవసాయ పరిశోధనా మరియు విస్తరణ సలహా సంఘ (REAC) సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా లాం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధనా సంచాలకులు డా. ఎన్.వి.వి.యస్. దుర్గా ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, ఎన్.టి.ఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లలో ఎదురయ్యే పంట సమస్యలు, చేపట్టాల్సిన పరిశోధనలు మరియు రైతులకు అందించాల్సిన విస్తరణ సేవలపై ఇందులో సమగ్రంగా చర్చించనున్నారు.
రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనడంతో పాటు, ఆధునిక సాగు పద్ధతుల ద్వారా దిగుబడిని పెంచడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. కావున, అభ్యుదయ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను, సూచనలను పంచుకోవాలని డా. దుర్గా ప్రసాద్ కోరారు.



