బాపట్ల జిల్లా, ఏప్రిల్ 27 (ప్రతినిధి):బాపట్ల జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ సోమవారం రాత్రి నగరం మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా విధానం, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమయానికి ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే బంకుల్లో పారదర్శకత పాటిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల ద్వారా జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.



