మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు బ్రాడీపేట 5/2లోని మానవత కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి కే. సతీష్ తెలిపారు. చంద్రమౌళినగర్ లోని ప్రెస్ క్లబ్ గుంటూరు లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వి.బి. కాశ్యప్ జన్నాభట్ల పాల్గొని మధుమేహం, థైరాయిడ్, హార్మోన్ సంబంధిత సమస్యలపై ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, న్యూరోపతి, బోన్ మినరల్ డెన్సిటీ, యూరిక్ యాసిడ్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం జీవనశైలి మార్పులతో మధుమేహం, థైరాయిడ్, రక్తపోటు వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని ఆయన సూచించారు. శిబిరానికి హాజరయ్యే వారికి అవసరమైన వైద్య సలహాలతో పాటు అందుబాటులో ఉన్న మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.



