GUNTUR DISTRICT NEWS: యోగాతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం

Karthik

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన కళావేదికలో నిర్వహించిన యోగా శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు తదితరులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. యోగా నిపుణులు వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై అవగాహన కల్పించి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందడంతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించవచ్చని నిపుణులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగా సాధనను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ యోగాంధ్ర–2026 ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీనివాసరావు, హార్టికల్చర్ డైరెక్టర్ రామారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review