GUNTUR CITY NEWS: గుంటూరులో పచ్చదనం మెరుగు పరచాలి

Karthik

రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో ఎవెన్యూ ప్లాంటేషన్ (రోడ్ల ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం) పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో నగరంలో పచ్చదనం పెంపొందించడం, పార్కుల నిర్వహణ, పారిశుధ్యంపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్లాంటేషన్ పనులను ఈ నెల 19వ తేదీ నుండే తప్పనిసరిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్, జిల్లా అటవీ అధికారికి తక్షణమే లేఖ రాయాలని ఆదేశించారు. నగరంలో ఈదురు గాలుల వలన విరిగిన లేదా కూలిన చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ట్రీ కటింగ్ రెండో బృందాన్నికూడా తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. పనులకు అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నందున, క్షేత్రస్థాయి పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. నగరంలోని అన్ని పార్కులలో మొక్కలు నాటడంతో పాటు, రోడ్డు డివైడర్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా వాటరింగ్ చేయాలని సూచించారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో స్థానిక ప్రజలను, కాలనీ వాసులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, అప్పుడే మొక్కల సంరక్షణ బాధ్యతాయుతంగా జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మొక్కలు నాటే ప్రాంతాల్లో మరియు నగరంలో ఎక్కడా కూడా గ్రీన్ వేస్ట్ లేదా ఇతర వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరాన్ని సుందరంగా, పచ్చదనంతో ఉంచేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారుసమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ వేణు, ఏడీహెచ్ శాంతి, ఏఈ నాసరయ్య పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review