విజయవాడలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “చలో విజయవాడ” మహాధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించి అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ రైతాంగ ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ తరహాలో రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణమాఫీ అమలు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాణిజ్య పంటలు, ధాన్య పంటలు సాగు చేస్తున్న రైతులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున జూన్ 30న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.



