కోటప్పకొండ, జూలై 24: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర రావు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు ఆలయ మండపంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరగనున్నాయని పేర్కొన్నారు.
తొలి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు, పారిశుధ్యం, భద్రత తదితర సౌకర్యాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలి ఏకాదశి ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.



