నిజాయితీగా, నిరాడంబరతతో ప్రజల మనిషిగా, గాంధేయ వాదిగా జీవితాంతం కృషి చేసిన చిరస్మరణీయులు కీ.శే. మండలి వేంకట కృష్ణారావును ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు అడుగులు వేయాలని మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మహా పురుషుడు మండలి వేంకట కృష్ణారావు శతజయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన లింగం శెట్టి ఈశ్వరరావు ప్రసంగిస్తూ మండలి వేంకట కృష్ణారావు తన రాజకీయ జీవితంలో అవనిగడ్డ సమితి అధ్యక్షులుగా, కృష్ణాజిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, అవనిగడ్డ శాసనసభ్యునిగా, మంత్రిగా ఎదుగుతూ దివిసీమ గాంధీగా ప్రజల చేత మన్ననలు పొందారని తెలిపారు. శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ మండలి వేంకట కృష్ణారావు జీవితాంతం అవినీతి రహితంగా ప్రజల పక్షాన నిలబడటం వలన నేటికీ తెలుగు ప్రజలు వారిని స్మరించుకుంటూ శతజయంతి సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. నేడు సమాజంలో నెలకొని ఉన్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడమే మండలి వేంకట కృష్ణారావు కు అందించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత కళారత్న డాక్టర్ భూసరపల్లి వేంకటటేశ్వర్లు ప్రసంగిస్తూ గాంధేయ మార్గాన్ని ఆచరణలో చూపెడుతూ అవనిగడ్డలో గాంధీ క్షేత్రాన్ని నిర్మించి ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి వారి జీవన ప్రమాణ స్థాయిని అభివృద్ధి చేయడానికి కృషి చేశారన్నారు. 1977 నవంబర్ లో సంభవించిన దివిసీమ ఉప్పెన ఫలితంగా వేలాది మంది ప్రజలు మరణించడం, కోట్లాది రూపాయల ఆస్తులు ధ్వంసమైన పరిస్థితుల్లో దివిసీమ పునః నిర్మాణంలో అద్వితీయమైన కృషి చేశారన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 1975లో హైదరాబాదు లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఐక్యపరిచారన్నారు. పేదలకు సేవ చేయడమే రాజకీయాల పరమావధి గా భావించి ఖద్దరు వస్త్రధారణతో సేవా తత్పరులుగా కృషి చేసి అందరివాడైనారన్నారు. స్వర్గీయ వినోబా భావే ప్రోత్సహించిన సర్వోదయ ఉద్యమంలో భాగస్వాములైనా రన్నారు.వివిఐటి విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రముఖ రచయిత మోదుగుల రవికృష్ణ ప్రసంగిస్తూ మండలి వేంకట కృష్ణారావు 1957లో మచిలీపట్నం లోక్ సభ సభ్యునిగా ఎన్నికైనప్పటి నుండి పలుమార్లు అవనిగడ్డ శాసనసభ్యులుగా గెలిచిన సందర్భంలోనూ ఓటుకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తన సేవా భావంతోనే గెలవడం ఆదర్శప్రాయమన్నారు. దివిసీమ ఉప్పెన నుండి ప్రజలను కాపాడాలనే మండలి వేంకట కృష్ణారావు ఆవేదన, అక్రందలను గమనించిన మదర్ ధెరిస్సా, నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్, నాటి ప్రతిపక్ష నేత ఇందిరాగాంధీ లాంటి ఎందరో ప్రముఖులు దివిసీమను సందర్శించి సహాయ కార్యక్రమాలలో భాగస్వాములైనారన్నా రు. ప్రముఖ ప్రజా గాయకులు, కళారత్న పి.వి. రమణ మండలి వేంకట కృష్ణరావు పై రచించిన గేయాన్ని ఆలపించారు. ప్రముఖ బుర్ర కథా పితామహులు నాజర్ కుమారుడు బాబూజీ మండలి వేంకట కృష్ణరావు పై రూపొందించిన బుర్రకథలోని కొన్ని భాగాలను ఆలపించి సభికులను ఆలోచింప చేశారు. తొలుత మండలి వేంకట కృష్ణారావు చిత్రపటానికి అతిధులందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ ఏ.వి. పటేల్, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షులు నడింపల్లి గురుదత్, ప్రముఖ రచయిత్రి సిహెచ్ సుశీల, మానవత అధ్యక్షులు పోలూరి వీరారెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, విశ్రాంత తెలుగు ఆచార్యులు సూరం నారాయణరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.



