విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని, ఆ సామాజిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిన కురుబ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను జిల్లాల వారీగా ఆ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు సత్కరించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆ సామాజిక వర్గీయులతో మంత్రి సవిత మంగళవారం సమావేశమయ్యారు. కురుబ యువత కేవలం తమ కులవృత్తికే పరిమితం కాకుండా, ఆధునిక విద్యను అందిపుచ్చుకుని అన్ని రంగాలలో రాణించాలన్నారు. కురుబలు రాజకీయంగా ఎదగాలంటే అది కేవలం విద్య, ఐక్యతతోనే సాధ్యమవుతుందన్నారు. కురుబల తమ బిడ్డల విద్యకు ప్రాధాన్యమివ్వాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ చాటిన కురుబ సామాజిక విద్యార్థులను ప్రోత్సాహించాలి, సత్కరించాలని సూచించారు. విద్యతోనే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండగలన్నారు. కురుబ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా కురుబ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో వ్యాపారులుగా అవకాశమిస్తామన్నారు. ఖాదీ గ్రామీణాభివృద్ధి బోర్డు ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసి, కురుబలతో గొర్రెలు, గేదెలు, కోళ్ల పెంపకం, పేపర్ ప్లేట్లు తయారీ వంటి యూనిట్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించేలా చర్యలు తీసుంటామన్నారు. అనంతరం మంత్రి సవిను కురుబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కురుబ సంక్షేమ సంఘం చైర్మన్ మల్లికార్జున, ఇతర ప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన ఆ సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



