నగరంలో విస్తరణ పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం రెడ్డిపాలెం, నందివెలుగు రోడ్, ఏటి అగ్రహారం రోడ్ల విస్తరణ పనుల్లో పెండింగ్ పోర్షన్లు, వాసవి నగర్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసిన లేఅవుట్, వివిధ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో పలు ప్రాంతాల్లో విస్తరణ ప్రారంభించిన రోడ్లలో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో స్థానికులతో చర్చించి, విస్తరణ పనులు పూర్తీ కావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తి రోడ్లతో ప్రజల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎక్కడైనా కోర్ట్ కేసులు ఉంటే అందుకు తగిన విధంగా వారితో మాట్లాడి, కేసులో ఏమైనా తీర్పులు ఉన్నాయా అని పరిశీలించాలని ఏసిపీలను ఆదేశించారు. చాలా ప్రాంతాల్లో విస్తరణ జరిగినప్పటికీ విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయకపోవడం గమనించామని, వాటిని షిఫ్ట్ చేసేలా వారితో సమన్వయం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రెడ్డిపాలెం చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు. పారిశుధ్య పనులు పిన్ పాయింట్ గా జరగాలని, రోడ్లు, డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు స్పస్టం చేశారు. వాసవి నగర్ లో లే అవుట్ ని పరిశీలించి, రోడ్ల వెడల్పు, డ్రైనేజి సిస్టం, రిజర్వ్ సైట్, మార్ట్ గేజ్ ఫ్లాట్ లను తనిఖీ చేసి, ప్రతి లే అవుట్ నిర్దేశిత నిబందనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, అనధికార లేఅవుట్ లపై చర్యలు తీసుకోవాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపీ రెహ్మాన్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.



