Visakha City news :విశాఖ వేదికగా బ్రిక్స్‌ కొత్త క్రీడా బంధం-బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు పిలుపు

Sharat
1 View

విశాఖపట్నం, ఆగస్టు 22:– భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కతాటిపైకి తీసుకురాగలవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

బ్రిక్స్‌ యువజన, క్రీడల మంత్రుల సమావేశాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అధికారిక విందులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్రిక్స్‌ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లకు విశాఖలో స్వాగతం పలికారు. క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కావని, ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలకు ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు.

క్రీడలు, యువతతో దేశాల మధ్య బంధం

విశాఖపట్నం ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’గా పేరొందిందని చంద్రబాబు అన్నారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలతో పాటు ఆర్థిక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా రెండో ఏడాది విశాఖ దేశంలోనే నంబర్‌వన్‌ ‘సిటీ ఆన్‌ ద రైజ్‌’గా గుర్తింపు పొందిందని తెలిపారు.

వ్యూహాత్మక మారిటైమ్‌ గేట్‌వేగా, టెక్నాలజీ–ఇన్నోవేషన్‌ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. సుదీర్ఘ తీరప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యమిచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ టూరిజానికి నగరంలో అపార అవకాశాలున్నాయని తెలిపారు.

క్రీడలతో ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక ప్రగతి

సాంకేతికత ఆధారిత జీవన విధానం కారణంగా యువతలో ఒత్తిడి పెరుగుతోందని సీఎం అన్నారు. ఒత్తిడిని అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు, యోగా, ధ్యానం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.

క్రీడల రంగం ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, ఈవెంట్‌ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్పోర్ట్స్‌ టూరిజం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల నిర్వహణతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని తెలిపారు.

2036 ఒలింపిక్స్‌ లక్ష్యంగా ప్రతిభకు ప్రోత్సాహం

‘అపెక్స్‌ 2036’ ద్వారా గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థను రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతిభావంతులను గుర్తించి శాస్త్రీయ శిక్షణ అందిస్తూ 2036 ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధం చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 56 రెసిడెన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ స్కూళ్లను ఏర్పాటు చేసి, వాటిని రాష్ట్రస్థాయి అకాడెమీలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లతో అనుసంధానిస్తామని వెల్లడించారు.

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ.. నెల్లూరులో తయారీ హబ్‌

అమరావతి కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. నెల్లూరును క్రీడా ఉపకరణాలు, అపారెల్‌ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖను అంతర్జాతీయ వాటర్‌ స్పోర్ట్స్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ఏపీలో శిక్షణ–ఆవిష్కరణ–తయారీ విధానంలో సమగ్ర క్రీడా ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్రిక్స్‌ దేశాల్లోని ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని పరస్పరం పంచుకునేందుకు దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందన్నారు.

విశాఖ కేంద్రంగా నెట్‌వర్క్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, విశ్వవిద్యాలయాలు, క్రీడా నిపుణులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలని చంద్రబాబు సూచించారు.

క్రీడా ఉపకరణాల తయారీ, హైపర్‌ఫార్మెన్స్‌ ట్రైనింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్‌ టూరిజం రంగాల్లో భాగస్వామ్యాలకు బ్రిక్స్‌ దేశాలు ముందుకు రావాలని ఆహ్వానించారు. భవిష్యత్‌ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడా సహకారం మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review