GUNTUR CITY NEWS: 2027 జూలై నాటికి ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది

Karthik

వచ్చే ఏడాది జూలై నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న హామీ మేరకు అన్ని విభాగాలతో సమన్వయం చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జిజిహెచ్ వైపు నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబి పనులను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, ఇతర విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్దేశిత సమయానికి పూర్తీ చేయడానికి ప్రణాళికాబద్దంగా నిరంతరం సమీక్షిస్తూ, అడ్డంకులు ఉంటే వాటిని పరిష్కరిస్తూ కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 38 పిల్లర్లలో 30 పిల్లర్స్ ఫౌండేషన్ పూర్తీ చేశారని, గత నెలలో బెంగాల్లో ఎన్నికలు ఉండడం వలన కార్మికులు ఎక్కువ మంది ఓటింగ్ కోసం వెళ్లడం కారణంతో పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం షుమారు 70 మంది పని చేస్తున్నారని, త్వరలో 100 మంది పని చేసేలా కాంట్రాక్టర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం, సాయంత్ర సమయాల్లో ఎక్కువ సమయం పని జరిగేలా చూడాలన్నారు. 3 పిల్లర్స్ కి క్యాప్ లు కూడా ఏర్పాటు జరిగిందని, పనులు సమాంతరంగా జరగడానికి గడ్డర్లను వేరే ప్రాంతంలో ప్రీ కాస్ట్ చేసి తీసుకురావడానికి స్థలం కూడా కేటాయించామని పేర్కొన్నారు. కొంత ప్రాంతంలో భూసేకరణ సమస్య ఉందని, దానిని నెలన్నర రోజుల్లో పరిష్కారం అయ్యేలా జిఎంసి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎట్టి పరిస్తితుల్లోను ఆర్ఓబి పనులను గడువుకి ముందుగానే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.పర్యటనలో మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీసిపిడిసిఎల్ ఎస్ఈ రమేష్, ఈఈ హుస్సేన్ ఖాన్, జిఎంసి సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఆర్&బి ఈఈ విశ్వనాధరెడ్డి, డిఈఈ చెన్నయ్య, కాంట్రాక్టర్ బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review