అలప్పుజ, సెప్టెంబర్ 12: కేరళ రాష్ట్రం అలప్పుజ జిల్లా పరిధిలోని చారిత్రక చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన పుష్పాంజలి సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా బాలశివుడిని దర్శించుకుని అర్చనలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ అనంతరం శ్రీ భగవతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మేల్ శాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, నాగదేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేశారు.
ఆరోగ్య ప్రదాయినిగా భక్తులు కొలిచే శ్రీ భగవతి అమ్మవారికి పుష్పాంజలి సమర్పించడం ద్వారా సర్వదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వహించే అన్నదానానికి అయ్యే మొత్తం వ్యయాన్ని దేవస్థానం బోర్డుకు పవన్ కళ్యాణ్ విరాళంగా అందజేశారు.Guntur Local News
పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకున్న సందర్భంగా అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. త్రిశక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ భగవతి అమ్మవారి దర్శనానికి నవరాత్రుల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
చెట్టికులంగర భగవతి అమ్మవారి ఆలయానికి 1200 ఏళ్లకు పైగా చారిత్రక ప్రాధాన్యత ఉన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. రాక్షస సంహారం కోసం శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిశక్తి స్వరూపిణిగా కొలువుదీరిన అమ్మవారిని భక్తులు విశేషంగా ఆరాధిస్తున్నారు.



